కరోనా టీకా తీసుకున్న మరో ఫ్రంట్ లైన్ వారియర్ మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. టీకా తీసుకున్న వలంటీర్ పిల్లా లలిత (28) ఆదివారం మృతి చెందింది. వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ కూతురు ప్రాణాలు విడిచిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలోని పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ ఇటీవల వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ కొద్దిగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. అయితే జ్వరం లక్షణాలు తీవ్రంగా ఉండటంతో లలిత ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకుంది. ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున మృతి చెందింది.
మృతురాలికి భర్తతో పాటు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. పలాస తహసీల్దార్ మధుసూదనరావు, కాశీబుగ్గ సీఐ శంకరరావు, డీఎంహెచ్వో చంద్రనాయక్ తదితరులు లలిత మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి గల కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్ తెలిపారు.
మరోవైపు లలిత మృతి చెందడంతో ఆమెతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న మిగతా వలంటీర్లు, వీఆర్వో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు పలాస పీహెచ్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక వలంటీర్ మృతి వార్త తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.2 లక్షలు ప్రకటించారు.