అన్నింటికీ ఆధార అనుసంధానం చేసుకోవాలని బలవంతం పెడుతున్న కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. డెడ్లైన్ దగ్గర పడుతున్నా అకౌంట్, మొబైల్తో పాటూ మరికొన్నింటికి ఆధార్ అనుసంధానం చేయలేదని బాధపడుతున్న వారందరికి ఉరట లభించే విషయం. ఆధార్ అనుసంధానానికి ప్రస్తుతానికి డెడ్ లైన్ లేదని కీలక ఆదేశాలు వెలువరించింది.
ఆధార్ సబ్సిడీ ఇవ్వడానికి తప్ప మిగిలిన వాటికి ఆధార్ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని డిమాండ్ చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చివరికి తత్కాల్ పాస్పోర్టు జారీకి కూడా ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరిగా కోరరాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆధార్ మాండేటరీ, ఆధార్ గోప్యతపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఖాతా, మొబైల్, తత్కాల్ పాస్పోర్ట్ లాంటి సేవలకు ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది.
ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 7న ఆధార్ కేసులో తుది తీర్పును ఈ నెలాఖరు కల్లా ఇవ్వడం సాధ్యపడకపోవచ్చని పేర్కొన్న సంగతి విదితమే. తప్పనిసరి ఆధార్ అనుసంధానంపై తామిచ్చే తీర్పు బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజిలు లాంటి ఆర్థిక సంస్థలపై ప్రభావం చూపే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల తుది గడువును ఆఖరి క్షణంలో పొడిగిస్తే అందుకు అంగీకరించే విషయంలో భారీ సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదముందని న్యాయమూర్తులు ఏకే సిక్రి, ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం తొలుత అభిప్రాయపడింది.
కేంద్రం ప్రతి చిన్నదానికి ఆధార్ తప్పనిసరి చేయడం మొదలు పెట్టింది. బ్యాంక్, మొబైల్ ఇలా అన్ని అకౌంట్లకు ఆధార్ అనుసంధానం అనేది కచ్చితమైపోయింది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మొదట డెడ్ లైన్ ఫిబ్రవరి 28గా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ మార్చి 31 అన్నారు. దీనిపై ఆందోళన చెందుతున్న సమయంలో సుప్రీం తాజా ఆదేశాలు జారీ చేసింది.