డబ్బులు చేతినిండా వున్నవాడు దానం చేస్తే గొప్ప కాదు. డబ్బులు కటకటగా వున్నవాడు దానం చేస్తే గొప్ప. సంపూర్ణేష్ బాబు ఆ విధంగా హీరో అనిపించుకున్నాడు. కేరళ అంటే ఉరకలు పరుగులు పెట్టిన మన హీరోలకు శ్రీకాకుళం అంటే స్పందన కలగలేదు. తెలంగాణాకు చెందిన సంపూర్ణేస్ బాబు రూ50 వేలు ప్రకటించడంతో టాలీవుడ్ కదిలింది.
తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర వాసులకు ఆపన్న హస్తం అందించేందుకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. వరద బీభత్సానికి కకావికలమైన కేరళ రాష్ట్రానికి దన్నుగా నిలిచిన తెలుగు చిత్ర ప్రముఖులు ఇప్పుడు తిత్లీ తుపాను బాధితులకు అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎన్టీఆర్ రూ. 15 లక్షలు, నందమూరి కళ్యాణ్రామ్ రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు.
అలాగే యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తన వంతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు పంపారు. దర్శకుడు అనిల్ రావిపూడి లక్ష రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. తన వంతు సాయం చేస్తానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పారు. తాజాగా , ‘మెగా’ ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తన వంతు సాయం అందించాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.