తనను అల్లారుముద్దుగా చూసిన తల్లి.. తనను తెరపై చూడాలనుకున్న మాతృమూర్తి ఇప్పుడు హఠాత్తుగా తనను వదిలేసి వెళ్లిపోవడంతో ఒంటరైపోయింది. చుట్టూ ఎంత మంది ఉన్నా తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ఒంటరయ్యానని భావిస్తూ తల్లినే తలచుకుంటూ తెగ బాధపడుతోంది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ. శ్రీదేవి ఆకస్మిక మృతి బోనీ కపూర్ కన్నా జాన్వీకి పెద్ద లోటు ఏర్పడింది. తల్లిచాటు బిడ్డగా జాన్వీ ఉండేది. ఇప్పుడు శ్రీదేవి మృతితో జాన్వీ ఒంటరిగి మిగిలింది. తల్లి మృతిచెంది నాలుగు రోజులు అవుతోంది. అయినా తల్లి గురించి బాధపడుతూ.. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ లేఖను పంచుకుంది.
ఆ లేఖలో తన తల్లిపై ప్రేమను చాటుకుంది. ఈ సందర్భంగా తల్లితో తాను మరచిపోలేని సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఆ ఫొటోలను విడుదల చేసింది. ఈ సందర్భంగా జాన్వీ లేఖ చదవండి..
‘నా హృదయంలో తీరని లోటు ఒకటి ఏర్పడింది. దాంతో ఎలా జీవించాలన్న విషయాన్ని నేర్చుకోవాలి. ఇంతలోటు ఉన్నప్పటికీ ఇంకా నేను నీ (శ్రీదేవి) ప్రేమ అనుభూతిని పొందుతున్నా. నువ్వు నన్ను బాధ నుంచి, నొప్పి నుంచి సంరక్షిస్తున్నట్లే అనిపిస్తోంది. నేను కళ్లు మూసిన ప్రతిసారి.. గుర్తు చేసుకోవడానికి కేవలం మంచి అనుభూతులే ఉన్నాయి. ఇలా చేసింది నువ్వే అని నాకు తెలుసు’.
‘మా జీవితాల్లోకి నువ్వు రావడం నిజంగా మా అదృష్టం. నువ్వు చాలా మంచిదానివి, చాలా స్వచ్ఛమైన వ్యక్తివి, ప్రేమమూర్తివి. అందుకే దేవుడు నిన్ను తిరిగి తీసుకెళ్లిపోయాడు. నా స్నేహితులు ఎప్పుడూ ‘నువ్వు హ్యాపీగా ఉంటావు’ అంటుండేవారు. ఆ సంతోషానికి కారణం నువ్వేనని నాకు ఇప్పుడు అర్థమైంది’.
‘నేను ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు.. ఏదీ సమస్యగా అనిపించలేదు, ఈ రోజు బాలేదని ఎప్పుడూ అనిపించలేదు.. ఎందుకంటే అప్పుడు నాకు నువ్వు ఉన్నావు కాబట్టి. నువ్వు నన్ను చాలా ప్రేమించావు. నేను ఎవరిపైనా ఆధారపడలేదు.. ఎందుకంటే నాకు కావాల్సిన ఒకేఒక్క వ్యక్తివి నువ్వు’.
‘నా జీవితంలో నువ్వు ఓ భాగం. నా ప్రాణ స్నేహితురాలివి. నీ జీవితాన్ని మొత్తం ఇచ్చేశావు. ఇప్పుడు నీ కోసం అదే చేయాలి అనుకుంటున్నా అమ్మా. నువ్వు గర్వపడేలా చేస్తాను. నిన్ను చూసి నేను ఎంత గర్వపడ్డానో.. అదే స్థాయిలో నన్ను చూసి నువ్వు గర్వపడే రోజు వస్తుందని ఆశిస్తూ పనిచేస్తా. ఇదే ఆలోచనతో ప్రతిరోజు నిద్రలేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉన్నావు.. దాన్ని నేను అనుభూతి చెందుతున్నా. నువ్వు నాలో, ఖుషిలో, నాన్నలో నిండి ఉన్నావు. నువ్వు మాపై వేసిన ముద్ర (చూపిన ప్రభావం) చాలా బలమైనది. మేము జీవించడానికి అది చాలు.. కానీ నీ లోటును తీర్చడానికి మాత్రం అది సరిపోదు’ అని జాన్వి లేఖలో పేర్కొన్నారు. ‘ఐ లవ్ యూ మై ఎవ్రీథింగ్’ అంటూ ముగించారు. దీంతోపాటు ఫ్యామిలీ ఆల్బమ్లోని కొన్ని ఫొటోలను పంచుకున్నారు.
ఈ విధంగా చెబుతూ లేఖ రాసింది. ఈ లేఖ చదివితే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇటీవల తన భార్య మృతి పట్ల బోనీ కపూర్ కూడా ప్రేమలేఖ రాశాడు. ఆ లేఖలో ఎంతో భావోద్వేగంతో కూడినదై ఉంది. శ్రీదేవి మరణం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.