దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి పండగ జరుపుకొన్నారు. ఈ ఉదయం రాజస్థాన్లోని జైసల్మేర్ చేరుకున్న మోదీ.. అక్కడి లోంగేవాలా పోస్ట్లో సరిహద్దు జవాన్లను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలు పాకిస్థాన్, చైనాను మోదీ పరోక్షంగా హెచ్చరించారు. భారత సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని హెచ్చరించారు.
ఈ రోజు యావత్ ప్రపంచం విస్తరణవాద శక్తులతో సమస్య ఎదుర్కొంటోంది. విస్తరణవాదం అనేది ఒక మానసిక వ్యాధి. వారింకా 18వ శతాబ్దపు భావజాలంతోనే ఉన్నారు. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విస్తరణ వాదాన్ని ఎదుర్కోవడంలో భారత వ్యూహం స్పష్టంగా ఉంది. ఇతరుల అభిప్రాయాలు, విధానాలను భారత్ గౌరవిస్తుంది. అయితే మనల్ని పరీక్షిస్తే మాత్రం దీటైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ రోజు భారత్ శత్రుదేశంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను, వారి నాయకులను హతమార్చింది. దేశ సమగ్రత, ప్రయోజనాలపై భారత్ ఎన్నడూ రాజీపడదు. ఈ విషయం ప్రపంచానికి కూడా అర్థమైంది” అని మోదీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఇంతటి గౌరవాన్ని పొందిందంటే అదంతా సైనికుల పరాక్రమాల వల్లే అని ప్రధాని కొనియాడారు.
ఉగ్రవాదులు ఏక్కడ దాక్కున్నా.. ఏరి పారేస్తాం : ప్రధాని మోదీ