తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తలసాని మంత్రి పదవి ఇచ్చారు… అదే పార్టీ నుంచి వచ్చిన తమ్మల నాగేశ్వరరావుకు అయితే ఎమ్మెల్సీ పదవిని… మంత్రి పదవిని కూడా ప్రసాదించారు..
అప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితిలో తీవ్ర అసహనం కనిపించింది. తెలుగుదేశం నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏమిటి? అని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే అనుకొంటే.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లకు పెద్ద పీట వేశాడు కేసీఆర్.
త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో కాంగ్రెస్ నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చి చేరిన డి.శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కనున్నట్టుగా తెలుస్తోంది. నిన్నలా మొన్న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి గులాబీ తీర్థం పుచ్చుకొన్న ఆయనకు ఈ ప్రాధాన్యత దక్కనున్నట్టుగా సమాచారం. మరి డీఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నేత! కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవి సంపాదించుకోలేక ఆ పార్టీని వీడిన వ్యక్తి.. ఆయన ఏమీ జననేత కాదు. మరి ఇలా వచ్చి చేరిన వారందరికీ పదవులు ఇచ్చుకొంటూ పోతే తమ పరిస్థితి ఏమిటి? అనేది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆది నుంచి ఉన్న వారి ప్రశ్న. ఇలాంటి వారందరి అసహనాలన్నీ పెల్లుబికీ తిరుగుబాటు వస్తుందో ఏమో!