ఉత్తర తెలంగాణలో మరో సాగునీటి ప్రాజెక్టు సిద్ధమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టు పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించడానికి సిద్ధంగా ఉంది. ఆ ప్రాజెక్టే మిడ్ మానేరు. ఈ ప్రాజెక్టు గేట్ల బిగింపు సహా అన్ని సివిల్, మెకానికల్, సాంకేతిక పనులు పూర్తయ్యాయి. 2006లో ప్రారంభమైన ప్రాజెక్టు పదేళ్లలో 50 శాతం పూర్తయితే.. మిగతా 50శాతం పనులు 10 నెలల్లోనే పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది.
శ్రీరాంసాగర్కు అత్యంత కీలకమైన ప్రాజెక్టు మిడ్మానేరు. మిడ్మానేరు ప్రాజెక్టుకు 25 గేట్ల బిగింపు పూర్తయ్యింది. దీంతో 25 టీఎంసీల నీటి నిల్వకు ప్రాజెక్టు సిద్ధమైంది. డ్యాంపై స్పిల్వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తచయ్యింది. మొత్తం రూ.2,150 కోట్ల ఖర్చుతో పది నెలల్లోనే 50 శాతం పనులు పూర్తి చేసి ప్రత్యేకత చాటారు. మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు మిడ్మానేరు ద్వారా సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టు 25 గేట్ల ఫ్యాబ్రికేషన్, బిగింపు పనులు పూర్తవడంతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి కావడంపై ఇంజనీర్లను మంత్రి అభినందించారు. ఈ ప్రాజెక్టు పూర్తితో దిగువ ఆయకట్టు రైతులకు ఏడాదికి కనీసం రెండు పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.