సోషల్ మీడియాలో ప్రధాన వినోదం అందించేది యూట్యూబ్. యూట్యూబ్ ఓ సముద్రంలాంటిది. దేని గురించి వెతికినా వీడియోలు లభిస్తాయి. ఇంట్లో కూర్చొని మనకు నచ్చిన వీడియోలు చూడడానికి అనువుగా యూట్యూబ్ ఉంది. అయితే యూట్యూబ్ ప్రధాన కార్యాలయంపై ఓ మహిళ కాల్పులు జరిపింది. దీంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ బ్రూన్లో యూట్యూబ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంపై ఓ మహిళ మంగళవారం (ఏప్రిల్ 3) కాల్పులు జరపడంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా ఆ మహిళ 10 రౌండ్లు కాల్పులు చేయడంతో ఉద్యోగులు భయోందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం ఆమె తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను శాన్ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బాధితులకు సంఘీభావం తెలిపారు.
స్పందించిన సోషల్ మీడియా ప్రపంచం
మరోవైపు ఈ ఘటనపై గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదమని, ఈ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని పిచాయ్ ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో మా ఉద్యోగులు, యూట్యూబ్ కమ్యూనిటీకి అండగా ఉండేందుకు నేను, సుసాన్ వొజ్సిస్కి (యూట్యూబ్ సీఈఓ) ప్రయత్నిస్తున్నాం. కాల్పుల ఘటనపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సె తదితరులు గూగుల్ యూట్యూబ్ ఉద్యోగులకు అండగా నిలిచారు.
