ఏపీ సీఎం హోదాలో హైదరాబాద్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఇవాళ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన జగన్ ఆపై సతీసమేతంగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ రాక విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ తన నివాసంలోంచి వెలుపలికి వచ్చి జగన్ కు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జగన్ దంపతులను ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు శాలువాతో సత్కరించారు. ఓ జ్ఞాపికను కూడా అందజేశారు. కేటీఆర్ జగన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా.. ఆయన సతీమణి శైలిమ వైఎస్ భారతీకి సంప్రదాయంగా బొట్టు పెట్టారు
అక్కడే ఉన్న తెలంగాణ స్పీకర్, ఇతర మంత్రులను జగన్ కు పేరుపేరునా పరిచయం చేశారు. మాటామంతీ సందర్భంగా, జగన్ తాను ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తున్నానని, తప్పక రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. జగన్ విజ్ణప్తికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.