ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి (ఏప్రిల్ 20) ఐదు రోజుకు చేరుకుంది. ఉక్కు సంకల్పంతో ముందుకుసాగుతున్న ఈ పోరులో ఎంపీలు తమ ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్నారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, విభజన హక్కుల సాధన కోసం ఎంపీలు మిథున్రెడ్డి (రాజంపేట), అవినాశ్రెడ్డి (వైఎస్సార్ కడప) ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఐదు రోజులుగా అన్నపానీయాలు మానేయడంతో మిథున్, అవినాశ్ ఆరోగ్యం క్షీణిస్తోంది.
ఢిల్లీలోని ఏపీ భవన్లో చేపడుతున్న దీక్షా శిబిరంలో మంగళవారం వారిని వైద్యులు పరిశీలించారు. వైద్య పరీక్షలు చేసి వారి ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటోందని ప్రకటించారు.
షుగర్ లెవల్స్
మిథున్రెడ్డి, అవినాశ్రెడ్డి బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయాయి. అవినాశ్రెడ్డి బ్లడ్ షుగర్ లెవల్స్ 78 కి పడిపోయాయి. మిథున్రెడ్డి శరీరంలోనూ బ్లడ్ షుగర్ లెవల్స్ 80కి పడిపోయాయి.
ఇంత ఆందోళన చేస్తున్నా కేంద్రం నుంచి మాత్రం చలనం రావడం లేదు. ఇక ఎంపీల దీక్షకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే వీరిద్దరితో పాటు దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్రావు, మేకపాటి రాజమోహన్రెడ్డిల ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి బలవంతంగా వైద్యం అందిస్తున్నారు.