నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబందించి ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించడంతో శుక్రవారాన్ని మినహాయిస్తే కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక వేడి రాజుకుంది. సాగర్ పీఠానే తామే దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. తిరుపతిలో త్యాగానికి గానూ నాగార్జున సాగర్ లో జనసేనకు అవకాశం కల్పిస్తారనీ ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక మాదిరే సాగర్లోనూ టీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఐతే వైసీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కరోనా బారినపడి చనిపోవడంతో నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటే ఖాళీగా ఉన్న లోక్ సభ, ఇతర రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికలు జరుపుతున్నది. షెడ్యూల్ ప్రకారం ఏపీలోని తిరుపతి లోక్ సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 17న పోలింగ జరుగనుంది.
సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య కొన్నేళ్లుగా స్నేహ బంధం కొనసాగుతోంది. వైసీపీ మద్దతు ఇస్తోందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇదిలా ఉంటే అనూహ్యంగా సాగర్ ఉపఎన్నికల్లో వైసీసీ అభ్యర్థి నామినేషన్ వేయడం చర్చనీయాంశమయింది.