ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో టీడీపీలో వికెట్లు టపాటపా పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా టీడీపీనుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. అనకాపల్లి ఎంపీ అవంతి వైసీపీ కండువా కప్పుకున్నారో లేదో ఇప్పుడు మరో ఎంపీ వైసీపీ కండువా కప్పుకున్నారు. అమలా పురం ఎంపీ రవీంద్రబాబు లోటస్ పాండ్లో జగన్ను కలసిన అనంతరం పార్టీలో చేరారు.రాబోయే ఎన్నికల్లో ఏదైనా ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయటానికి వీలుగా రావీంద్ర వైసిపిలో చేరినట్లు సమాచారం.పదవికి, పార్టీకి రాజీనామా చేసిన వెంటనే వైసీపీలో చేరారు.
టీడీపీనీ వీడటం ప్రధానంగా పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడుతున్నారు. టిడిపి నుండి ప్రజా ప్రతినిధులు వచ్చేస్తుండటానికి అది కూడా ఓ కారణనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో రవీంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. అందుకే వైసీపీలో చేరాలని నిర్ణయానికి వచ్చారు. రెండువారాలుగా వైసీపీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక రిజర్వ్డు సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.
పార్టీకి, పదవికి రాజీనామా చేసిన అనంతరం బాబు నైజాన్ని బయట పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కులాల వారీగా చంద్రబాబు వద్ద ఆర్మీ ఉంటుందన్నారు. ఏ కులం వారు విమర్శలు చేస్తే అదే కులానికి చెందినవారితో తిట్టిస్తారని రవీంద్ర బాబు ఆరోపించారు.
తన నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్టు చెప్పారు. దళితుడిగా ఉన్నందునే టీడీపీలో వివక్ష కొనసాగించినట్టు రవీంద్రబాబు చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ తనకు ఇచ్చేది లేదని టీడీపీ చెప్పడంతో పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు.
వైసీపీలోకి వరుస వలసలతో టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. నిన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు ఇప్పుడు జగన్ గూటికి చేరుతున్నారు. దీంతో ఏంచేయాలో తెలియక టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు.