ఏపీసీఎం చంద్రబాబు నాయుడిపై భాజాపా ఎంపీ జీవీఎల్ నరశింహారావు నిప్పులు చెరిగారు. టీడీపీ అట్టహాసంగా నిర్వహించింది మహానాడు కాదని.. అది దగానాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై టీడీపీ బురద జల్లుతోందని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల ముఖ్యమంత్రి.. బలహీన పడినప్పుడల్లా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తారని ఆయన విరుచుపడ్డారు. పెట్రో ధరల పెరుగుదలకు కేంద్రానికి సంబంధం లేదన్నారు.
మేము తినము, మిమ్మల్ని తిననీయము అంటూ దేశానికి ప్రధాని మోదీ మాట ఇచ్చారని… అలాంటప్పుడు ఏపీలో జరుగుతున్న అవినీతికి బీజేపీ ఎలా సహకరిస్తుందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే ప్రతి పైసాకు లెక్కలు చెప్పాల్సిందేనన్నారు. రాజధాని నిర్మాణంలో దోపిడీ జరిగిందనే విషయాన్ని కాగ్ పేర్కొందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి నిధులు ఇస్తే… టీడీపీకి ఎన్నికల నిధులు ఇచ్చినట్టు అవుతుందని అన్నారు.
శాఖపట్నం-చెన్నై కారిడార్ లో విశాఖ, విజయవాడల్లో పారిశ్రామికవాడల నిర్మాణానికి కేంద్రం అనుమతించిందని చెప్పారు. వీటివల్ల భారీ ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శించారు. ఊరవెల్లికి కూడా సిగ్గు తెప్పించేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు… యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా ఉద్యమ సమితి నేతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు యూటర్న్ లు, ట్విస్ట్ లు తీసుకోవడానికి ఇది సినిమా కాదని అన్నారు.
రూ. 2,333 కోట్లతో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకాన్ని ఏర్పాటు చేస్తుంటే.. కేంద్రం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తుంది. రూ. 300 కోట్లను రూ.3 వేల కోట్లగా.. అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు క్షమపణ చెప్పాలని’జీవీఎల్ డిమాండ్ చేశారు. గుజరాత్కు కేంద్రం అదనంగా ఏమీ ఇవ్వలేదని జీవీఎల్ పేర్కొన్నారు. ఏపీకి మూడు ఇండస్ట్రియల్ సిటీలు ఇచ్చామన్నారు.