బాబ్లీ కేసులో ధర్మపురి న్యాయస్థానం చంద్రబాబుకు పంపిన నాన్ బెయిలబుల్ నోటీసుల వ్యవహారం తెలుగు రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదంతా భాజాపా చేస్తున్న గరుడ ఆపరేషన్లో భాగమేనని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపనలపై ఘాటుగా స్పందించారు భాజాపా నేతలు.
నోటీసుల విషయంలో భాజాపాకు ఎటువంటి సంబందంలేదని ఆ పార్టీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి తేల్చి చెప్పారు. 2010 నాటి కేసుకు సంబంధించి బీజేపీపై ఎలా నిందలు వేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఏవైనా అనుమానాలుంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలని సూచించారు.
చంద్రబాబు అరెస్ట్ వారెంట్పై రాష్ట్రభాజానా అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర కోర్టు నోటీసులు పంపిస్తే బీజేపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనుక ప్రధాని మోదీ ఉన్నారనడం దారుణమన్నారు.
ఐదారేళ్లగా ఈ బాబ్లీ కేసు నడుస్తోందని.. అప్పటి నుంచి నోటీసులు వస్తున్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కోర్టు వాయిదాలకు వెళ్లకపోవడం వల్లే నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారన్నారు. టీడీపీ నేతలు మాత్రం నోటీసులు వెనుక మోదీ హస్తం ఉందని డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. వాయిదాలకు వెళ్లకుండా కోర్టుల్ని అగౌరవపరించింది చంద్రబాబేనని కౌంటర్ ఇచ్చారు.