ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉపఎన్నికను సెమీ ఫైనల్ గా భావిస్తున్న ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఉపఎన్నికల విషయంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కన్నా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థి పార్టీగా బీజేపీ నిలిచింది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేదని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు.
అయితే మునుగోడులో బల బలాల విషయానికొస్తే కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా ఇక్కడ గట్టిగానే ప్రభావం చూపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ తరుపున విజయ బావుటా ఎగురవేసిన ఎమ్మేల్యేలు కూడా ఉన్నారు. దాంతో సిపిఎం పార్టీని తక్కువగా అంచనా వేయడానికి లేదు. అందుకే బీజేపీ వామపక్షాల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. వామపక్షాలు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికే అవకాశం ఉందని గట్టిగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత ఉన్న టిఆర్ఎస్ కు వామపక్షాలు మద్దతు ఎవ్వడం ఏంటని ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. ఇటీవల ప్రజా సంకల్ప యాత్రలో బండి సంజయ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
దాంతో టిఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఉన్న వామపక్ష శ్రేణులు బీజేపీ వైపు తిరిగే అవకాశం లేకపోలేదు. టిఆర్ఎస్ కు వామపక్షాలు మద్దతు పలుకుతాయనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం ద్వారా టిఆర్ఎస్ కు వ్యతిరేకత చూపే వామపక్ష ఓటర్లు కచ్చితంగా బీజేపీ వైపు చూస్తారని కమలనాథుల వ్యూహంగా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ వ్యూహం ప్రకారం వామపక్షాల ఓటర్లను ఆకర్షిస్తే టిఆర్ఎస్ కు పెద్ద దేబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే టిఆర్ఎస్ కు వామపక్షాలు మద్దతు పలికే అవకాశమున్న నేపథ్యంలో.. ఓటు బ్యాంక్ లో చీలిక ఏర్పడితే మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది. అందుకే వామపక్ష ఓటర్ల విషయంలో బీజేపీ పక్క ప్రణాళిక బద్దంగా వ్యూహాలు రచిస్తోంది.
Also Read: రాములమ్మ అలక.. .బిజెపికి తలనొప్పి !