రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి ‘ఆత్మ స్నేహితుడు’ ఏవీ సుబ్బారెడ్డి మధ్య వార్ మరింత ముదిరింది. ఇప్పుడు ఇద్దరి మధ్య వార్ మరో మలుపు తిరింగింది. నంద్యాల సిటీ కేబుల్లో మంత్రి వార్తలతో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యక్రమాలను కూడా ప్రసారం చేయడం లేదు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లోనూ వీరి వార్తలకు బ్రేక్ పడింది.
ఏవీ సుబ్బారెడ్డి ఆదేశాలతోనే నంద్యాల సిటీ కేబుల్లో భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డికి సంబంధించిన వార్తలను నిషేధించారు. తొలుత భూమా అఖిలప్రియ వార్తలను మాత్రమే నిలిపివేశారు. బ్రహ్మానందరెడ్డి వార్తలను కొనసాగించారు. అయితే తన సోదరి అఖిలప్రియకు సంబంధించిన వార్తలను కూడా ప్రసారం చేయాలని బ్రహ్మానందరెడ్డి చానల్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆయనకు సంబంధించిన కవరేజ్ను కూడా ఆపేశారు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లోనూ వీరి వార్తలకు బ్రేక్ పడింది.
సిటీ కేబుల్లో తమకూ 50 శాతం వాటా ఉందని, ఎందుకు ప్రసారం చేయరంటూ మేనేజర్ జయచంద్రారెడ్డితో అఖిలప్రియ వాదించినట్టు సమాచారం. అయితే, ఏ విషయమూ ఏవీ సుబ్బారెడ్డితోనే తేల్చుకోవాలని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది.ఆయనతో మాట్లాడే ప్రసక్తే లేదని అఖిలప్రియ భీష్మించారు. మొత్తమ్మీద వారం రోజులుగా వీరిద్దరి వార్తలు లేకుండానే సిటీకేబుల్ నడుస్తుండటం చర్చనీయాంశమయ్యింది. భూమా కుటుంబ వార్తలు లేకుండా ఉండటం సిటీ కేబుల్ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం.
పరిణామాలు చూస్తుంటే భామా అఖిల రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారయ్యింది. టీడీపీనుంచి గెంటివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కనీసం ఆళ్లగడ్డ టికెట్ కూడా దక్కకుండా చేసేందుకు ఏవీ పావులు పదుపుతున్నారు. పార్టీలో అఖిలకు సరైన సపోర్ట్ లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని భూమా అనుచరులు ఆరోపిస్తున్నారు.