రాజకీయాల్లో అడుగు పెట్టేముందు ఎవరైనా చెప్పేది ప్రజాసేవ కోసమనే మాట అని అందరికీ తెలిసిందే. పేరుకే ప్రజాసేవ…ఒక వేల ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి వస్తే మాత్రం తన సొంత పనులు చేసుకోవడమే సరిపోతుంది. పాలిటిక్స్కి , సినిమాకు విడదీయ రాని అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్ అలీ రాజకీయ ఎంట్రీ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ హాట్గా మారింది.
అందరి రాజకీయ నాయకుల మాదిరి కాకుండా అలీ తన మనసులోని మాటను బయట పెట్టారు. కేవలం ఎమ్మెల్యేగా గెలవడం కాకుండ , మంత్రిపదవి ఎవరు ఇస్తే వారి పార్టీలో చేరేందుకు సిద్దమని కుండబద్దలు కొట్టి చెప్పారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్ను అలీ కలవడంతో ఆయన వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నెల 9 పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో నిర్వహించే బహిరంగ సభలో ఆలీ చేరుతున్నారనే హడా వుడి అంతా ఇంతా కాదు.
వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతుండగానే… జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ను కలిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అలీ కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. అసలు అలీ ఏపార్టీలో చేరుతున్నారనే వార్తలకు తెరదించారు అలీ. కేవలం ఎమ్మెల్యేగా గెలవడం కాదు, మంత్రిపదవి ఎవరు ఇస్తారో వారి పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. ఏ కండువా నా మీద వేసినా నేను మంత్రిపదవి కండిషన్ పెడతాను. దానికి ఓకే అంటేనే నేను వెళ్తానన్నారు.
తాను కేవలం మంత్రి పదవి కోసమే ఎన్నికల్లోకి దిగుతున్నానని ప్రకటించారు. ఎవరైతే పేపర్ పైన తనకు రాసిస్తారో ఆ పార్టీలో చేరతానని బాహాటంగా చెబుతున్నాడు. మంత్రిపదవి ఇస్తానంటే స్టార్ క్యాంపెయినర్ గా ఏ పార్టీ తరఫున అయినా రాష్ట్రం మొత్తం పర్యటించడానికి సిద్దంగా ఉన్నానని …తాను కోరిన గుంటూరు-1 లేదా విజయవాడ-1 లేదా రాజమండ్రి సీట్ మాత్రమే కావాలి అంటూ కండీషన్ పెట్టారు.
మంత్రి పదవికోసమే అయితే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిన పనిలేదు. నారా లోకేష్ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి చేపట్టారు. అలానే అలీ కూడా పార్టీలో చేరి…ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అయ్యి మంత్రిగా కొనసాగవచ్చు. అంత మాత్రానికి ఇంత హడా వుడీ చేయడమెందుకు. మంత్రి పదవి కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అలీ చెప్పడం కొసమెరుపు. 9న ఇచ్చాపురంలో వైసీపీలో చేరే అంశంపై అలీ స్పష్టత ఇవ్వలేదు. జరగొచ్చు, జరకపోవచ్చు. 48 గంటల్లో ఏదైనా జరగచ్చు అని మరో సారి ఉత్కంఠకు తెరలేపారు. అలీ చెప్పిన కండీషన్స్కు ఏపార్టీ ఒప్పుకుంటుందో చూడాలి.