తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కవిత, కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, అది ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందన్నారు. కేసీఆర్ ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చి సీమాంధ్ర విద్యార్థులను చదువుకు దూరం చేసిందని విమర్శించారు.
అమరావతికి వంద కోట్లు బిక్షమిస్తున్నట్టు కేటీఆర్ మాట్లాడడం దారుణమని యాష్కీ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను సీమాంధ్రులను అవమానించడమేనని చెప్పారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలను టీఆర్ఎస్ బెదిరింపులు, దాడుల నుంచి రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తుందని మధుయాష్కీ చెప్పారు.
అవినీతి విషయంలో తమిళనాడు శశికళ ను కవిత మించిపోయిందని, ఆమెను ‘తెలంగాణ శశికళ’ అని యావత్తు ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే అబద్ధాలకు మారుపేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రావాళ్లకే పనిచేస్తుందని, ఆ పార్టీని ఓడించాలని హరీష్ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు.