ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై అన్ని పక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. మిత్ర పక్షాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మొన్న ఉత్తర భారతదేశంలో దళితుల ఆందోళనలు మిన్నంటి తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై అన్ని రాజకీయ పార్టీలు విమర్శలకు పని చెప్పాయి. ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్రెడ్డి వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమిపై జోస్యం చెప్పారు.
హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా 2019 ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం లేదని ఎస్.జైపాల్రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర భారతంపై ఉన్న విశిష్ట అవగాహనతోనే తానీ మాట చెబుతున్నట్లు చెప్పాన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లిలో కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కడా బీజేపీ గెలవదు. ఈ నాలుగేళ్లలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, రుణాలు రైతులకు ఇవ్వకపోగా, రుణాలు తీసుకున్న నీరవ్ మోదీ, విజయ్ మాల్యా విదేశాలకు చెక్కేయడం లాంటి ఘటనలతో బీజేపీకి భారీ నష్టం వస్తుందని చెప్పారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2019లో బీజేపీ ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మరోసారి ఢిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగురవేయడం ఖాయంగా ధీమా వ్యక్తం చేశారు.