సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు? పదవికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు వచ్చింది మొదలు నడుస్తున్న చర్చ ఇది. తను ఏ రాజకీయ పార్టీలో చేరుతారో చెప్పకుండా సస్పెన్స్లో పెడుతూ వస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ ఊహాగానాలు వినిపించాయి.
గతంలో తన పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయనొస్తానంటే నేనొద్దంటానా అని చెప్పేశారు. మరో వైపు తమ పార్టీలో చేర్చుకొనేందుకు టీడీపీ, బీజేపీ విశ్వప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రతీ సారి దాట వేత దోరణిని ప్రదర్శించిన ఆయన ఇప్పుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే తెలుస్తోంది.
తాను చేస్తున్న ఉద్యోగాన్ని స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా వదులుకుని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకంటూ, ఇంతకాలం జిల్లాలు పర్యటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు.ప్రతి వర్గానికీ నిర్దిష్టమైన పాలసీని తాను రూపొందించానని, దాని అమలు దిశగా కృషి చేస్తానని అన్నారు. రైతులు, గ్రామీణ ప్రజల స్థితిగతులు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటిపై పోరాడుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు.
తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తానని లక్ష్మీ నారాయణ వెల్లడించారు. ఇతర పార్టీలతో పొత్తులపై ఇప్పుడే ఏమీ ఆలోచించడం లేదని, అందుకు చాలా సమయం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇతర పార్టీలల్లో చేరుతారా లేకా సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారా అన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. ఒక వేల పార్టీలో చేరాలనుకుంటే జనసేనలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.