వివాదాలకు కేరాఫ్ అయిన చింతమనేని నియోజకవర్గంలో ఇంకోసారి ఘర్షన వాతావరణం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో చింతమనేనిపై వైసీపీ తురుపునుంచి పార్టీ యూరప్, యూకే కన్వీర్ కొఠారు అబ్బయ్య చౌదరి పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటో ఉండటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకమిడి గ్రామంలో చోటు చేసుకుంది. ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో ఉండటం పట్ల టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షనకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరు వర్గాలను వారించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ఫ్లెక్సీని స్థానిక వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీకి అటూ, ఇటూ ఎన్టీఆర్, వైయస్సార్ ఉండగా మధ్యలో జగన్, అబ్బయ్య, కొడాలి నాని ఫొటోలు ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలను వైసీపీ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీని తొలగించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.