ఏపీలో ఐటీ అధికారుల దాడులు కొన సాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అధికారపార్టీ నేతలే టార్గెట్గా ఈ దాడులు కొనసాగుతున్నాయి. బీద మస్తాన్ రావు, సీఎం రమేష్ ఇళ్లపై దాడలు జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా విశాఖపట్నం జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘పేరం’ గ్రూపుపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఈ రోజు దాడులు నిర్వహించింది. పేరం గ్రూపు అధినేత హరిబాబుకు చెందిన ఇళ్లతో పాటు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
దాదాపు 15 రోజుల క్రితం ఇక్కడ తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్మిన నేపథ్యంలో దానికి వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చెల్లించలేదన్న విషయమై ఐటీ శాఖ తాజా దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.
పేరం గ్రూపు అధినేత హరిబాబు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్కు బంధువు కావడం గమనార్హం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన సంస్థ, ఇళ్లలో ఐటీ దాడులకు పాల్పడుతున్నారా? అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.