రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి..ఇది కాదనలేని సత్యం. దేశంలో ఇప్పటివరకు అధికారం కోసం రాజకీయ పార్టీలు అమలుసాధ్యం కానీ ఎన్నో హామీలిచ్చాయి. వాటిపై ప్రజల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చ దేనికంటే తెలంగాణ కాంగ్రెస్ ఫార్ములా 6 గురించి.
కర్ణాటకలో బీజేపీ సర్కార్పై పోరులో భాగంగా ఫార్ములా 5తో వచ్చి అధికారాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్. బీజేపీ సర్కార్ అవినీతి, 40 శాతం కమీషన్, కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలకు నచ్చడంతో హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు కన్నడ ప్రజలు.
ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు ఆరు స్కీంలను ప్రకటించారు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇంటి పథకం, యువ వికాసం పథకం, చేయూత పెన్షన్ పథకంలను ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రకటించిన స్కీంలపై ప్రజల నుండి భిన్నమైన స్పందన వస్తోంది. ఈ పథకాలు కర్ణాటకలో తప్ప కాంగ్రెస్ పాలిస్తున్న మిగితా రాష్ట్రాల్లో ఎక్కడా అమల్లోలేవు.అందుకే కాంగ్రెస్ నేతల ప్రసంగాలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనే భావన వ్యక్తమవుతోంది.
ఇక 2018లోనూ కాంగ్రెస్ ఇలాంటి హామీలనే గుమ్మరించింది. కానీ ప్రజలు ఇవేమీ పట్టించుకోలేదు. బీఆర్ఎస్కే రెండోసారి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నేతలు ఇలా అమలు సాధ్యం కానీ హామీలతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే కాంగ్రెస్ నామమాత్రపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆల్రెడీ బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న పెన్షన్ పథకాలనే కాంగ్రెస్ కూడా ప్రకటించి రాజకీయ పబ్బం గడపాలని భావిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని ఫీట్లు చేసినా పరాభవం తప్పదని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
