కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే తగిలింది. చంద్రబాబు ఆశించినవేవి బడ్జెట్లో ప్రతిఫలించలేదు. విభజన హామీలకు సంబంధించి గానీ, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి గానీ బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు కనబడలేదు. దీనిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలపై, తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలపై కూడా కేంద్ర బడ్జెట్లో న్యాయం చేయలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నామ మాత్రంగా సాయం చేసిందని, వేల లక్షల కోట్లు సాయం చేస్తేనే నిజంగా సాయం చేసినట్లు అని వ్యాఖ్యానించారు.
టీడీపీ,భాజాపా పొత్తుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ మాత్రమే కాదని దేశంలోని అన్ని పార్టీలకు ఈ బడ్జెట్పై నిరాశ, నిస్పృహ ఉన్నాయని చెప్పారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని, అతి తక్కువగా నిధులు ఇచ్చి సాయం చేశామన్నామంటే ఎలా అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాలా సహనం ఉందని ఆయన ఎంతో ఓపికగా ఉన్నారని వ్యాఖ్యానించారు.