సీఎం కేసీఆర్ అభ్యర్తుల జాబితాలో తన పేరు లేకపోవడంపై కొండా సురేఖ దంపతలు కొద్ది రోజుల నుంచి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ ఎందుకు కేటాయించలేదో ఈనెల 24 లోపు చెప్పాలని…సరైన సమాధానం రాకుంటే పార్టీకీ రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీ అధిష్టానం స్పందించకపోవడతో మనస్థాపం చెంది సురేఖ దంపతలు పార్టీకి కొద్ది సేపటిక్రితం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. తాను నాలుగు సంవత్సరాల పాటు ప్రయత్నించినా, కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఏ కారణం లేకుండానే టికెట్ ఇవ్వకుండా గెంటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ ను సీఎంను చేయాలని అనుకుంటున్న కేసీఆర్, ఎంతో మంది సీనియర్ నాయకులను అణచి వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తాను అడిగిన ఎన్నో ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సమాధానాలు రాలేదని చెప్పారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను కూడా ఆమె విడుదల చేశారు.
ప్రతి పనిలో కేటీఆర్ తీసుకునే పర్సంటేజ్లు, హైదరాబాద్లో ఎన్ని లైసెన్సులు చేస్తున్నారో టీఆర్ఎస్లో అందరికీ తెలుసునని.. అవినీతి సొమ్ముతో కల్వకుంట్ల వారి ఖజానా నిండిపోయిందని సురేఖ ఆరోపించారు.రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా బార్లకు లైసెన్సులు ఇచ్చారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య విలువలు ఏనాడో కేసీఆర్ పాతరేశారని.. ఒక్క మహిళా మంత్రి కూడా లేని కేబినెట్ కేసీఆర్దేనన్నారు.
ఓ బీసీ మహిళగా తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా, కేసీఆర్ తన దొరతనాన్ని చూపించారని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని, అందువల్లే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని ఆమె వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.