నెల రోజుల పాటు జరిగిన పార్లమెంట్ సమావేశాలు దాదాపు 20 రోజులు సక్రమంగా జరగలేదు. ప్రతిపక్షాల ఆందోళన అనే సాకుతో పార్లమెంట్ సమావేశాలు రోజు ఒకే తీరుగా జరిగాయి. ఉదయం ప్రారంభమైన సమావేశాలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడి ఆ తర్వాత మళ్లీ సమావేశాల ప్రారంభమై చివరికి వాయిదా పడుతున్నాయి. ఏ మాత్రం దీనిలో మార్పు లేకుండా దాదాపు 15 రోజులుగా ఈ విధంగా పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.
అనుకున్న ప్లాన్ ప్రకారం సమావేశాలను నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసింది. విలువైన పార్లమెంట్ సమావేశాలు వృథా అయ్యాయి. ఎంతో విలువైన సమయం ఒక్క చర్చ లేకుండా ముగిసిపోయింది. అయితే ఈ విధంగా జరగడానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎదురుదాడికి దిగారు.
శుక్రవారం (ఏప్రిల్ 6) ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు నిరసనగా ఈ నెల 12వ తేదీన బీజేపీ ఎంపీలు నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించారు. ఈ ప్రతిష్టంభనకు కారణం కాంగ్రెసేని ఘాటుగా విమర్శించారు.
తమ పార్టీ (బీజేపీ) కలుపుగోలు రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్షాలు మాత్రం విభజన రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల తీరుకు కారణం బీజేపీకి బలం పెరుగుతుండడమేనని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల కృషి కారణంగానే తమ పార్టీ బలోపేతమవుతోందని చెప్పారు.
ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బీజేపీ నేత అనంత్ కుమార్ విలేకర్లకు తెలిపారు. తమ పార్టీ ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ యాత్రను కూడా నిర్వహిస్తుందని ప్రకటించారు.