వైసీపీలో ఎమ్మెల్యే రోజాకు ఉన్న ప్రాధాన్యత అందరికి తెలసిందే. రోజాపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పార్టీలో రోజా కు ప్రాధాన్యత తగ్గలేదు. తన మాటల తూటాలతో అధికార పక్షానికి ధీటుగా సమాధానం చెప్పడంలో ఆమె ముందుంటారు. జగన్పై తనకున్న అభిమానాన్ని మరో సారి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి చాటుకున్నారు.
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు. ‘గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా’ అనే క్యాప్షన్ తో మొదలు పెట్టి ‘నాన్న ఆశయాలే శ్వాసగా బతికావు. నాన్నపై కుట్రలను సహించక దేశాన్ని శాసించే నియంత మెడలు వంచి, నమ్ముకున్న మా కోసం దమ్మున్న నాయకుడిగా నాన్న పేరుతో పార్టీ పెట్టావు. దొంగ హామీలు ఇవ్వలేదు, కుల రాజకీయాలు చేయలేదు, వేరొకరి ప్రభతో వెలగాలనుకోలేదు. సింహంలా సింగిల్ గా నిలిచావు. ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు. జగనన్నా, నీ వెంటే మేముంటాము,,ఈ పోరాటంలో మేము సైనికులమవుతాము!’ అని పేర్కొన్న రోజా, ‘ఆఖరి శ్వాస వరకూ ‘జై జగన్’ అంటూనే ఉంటా!’ అని ముగించారు. దీన్ని బట్టి చూస్తె అర్థమవుతోంది జగన్పై తనకున్న అభిమానం.