ఏపీ మంత్రి నారా లోకేష్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది మాటల తుటాలను పేలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీపై ఆయన సంధించే ప్రశ్నలకు సమాధానాలు లేక వారు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన లోకేష్.. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు క్యూ కట్టేలా రోజుకు 20 గంటలు(చంద్రబాబు కంటే ఒక గంట ఎక్కువ).. కాదు కాదు అహర్నిశలు… శ్రమిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఏ ఛానల్ ఓపెన్ చేసినా.. ప్రధాన పత్రికలు తిరగేసిన కనిపించే వార్త.
ఎన్నికల సమయంలో నారాలోకేష్ను హైప్ చేయడానికి చంద్రబాబు అనుకూల మీడియా చంద్రబాబు కంటే ఎక్కువ కష్టపడుతున్నది. ఏదేమైనా ప్రస్తుతం లోకేష్ తన ప్రశ్నలతో ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో బీజీగా ఉన్నారు. అవునా.. కాదా.. చెప్పండి తమ్ముళ్లు.. అంటూ చంద్రబాబు స్టైల్నే అనుసరిస్తున్నారు.
సరే సరే ఇప్పడిదంతా చెప్పుకోవడం ఎందుకని అంటారా.. నారా లోకేష్ సంధించే ప్రశ్నలు ఆయనకే రివర్స్ అవుతున్నాయి.. ఆయన మాటల తుటాలు.. తుస్సుమంటున్నాయి కనుక. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వార్తను దాదాపు అన్ని మీడియాల్లో కనుమరుగైంది. సాక్షివారు కూడా ఏదో జీతాలిచ్చేది జగనే కాబట్టి.. అప్పుడప్పుడు చూపిస్తూ.. రాస్తూ ఉన్నారు. ప్రజలు కూడా దాదాపుగా మరిచినట్టే అనుకోవాలి. కానీ ఆ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా వాడుకోవాలి అని చూస్తున్నారు లోకేష్. అదే ఇప్పుడు రివర్స్ అవుతోంది. వైఎస్ఆర్సీపీ పెద్ద డ్రామా పార్టీ అని… వైఎస్ఆర్సీపీ అభిమాని జగన్ను పొడిస్తే ఆ నింద టీడీపీపై వేస్తున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి ఈ కేసు వార్త హాట్ టాపిక్గా మారింది. పొడిచింది వైఎస్ జగన్ అభిమాని అంటున్నారు సరే.. అతను పనిలో పెట్టుకున్న రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి ఏ పార్టీకి సంబంధించినవారు.. ఆయనకు, చంద్రబాబుకు ఉన్న సంబంధాలు ఎలాంటివి? హర్షవర్థన్ సిట్ విచారణకు హాజరైనంత దర్జాగా.. ఎన్ ఐఏ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదు? ఏవో సాకులు చూపుతూ విచారణకు ఎందుకు దూరంగా ఉన్నారు? సీసీ టీవీ ఫుటేజీ లేకుండా చేయడం ఓ అభిమానికి సాధ్యమయ్యే పనేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
లోకేష్ ఇక్కడితో ఆగకుండా వైఎస్ఆర్సీపీ అభిమానే జగన్ను కత్తితో పొడిచారని ఎన్ ఐఏ తేల్చేసిందని ప్రకటించారు. అరే ఈ మాట లోకేష్ నోట తప్ప.. ఇంకేక్కడ అధికారికంగా వెలువడలేదే అంటున్నారు నెటిజన్లు. ఇక బీజేపీ-వైఎస్ఆర్సీపీ మైత్రి గురించి టీడీపీ చేసే వ్యాఖ్యల పరిస్థితి కూడా ఇలానే ఉంది. వారు చేసే విమర్శలు.. కొత్త ప్రశ్నలకు ఉదయించేలా చేస్తున్నాయి. నాలుగు సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ విషయాలు తెలియవా అంటూ డైరెక్ట్గానే అడుగుతున్నారు. ఏదేమైనా మొన్నటివరకు పప్పులా ఉన్న రాహుల్.. ఈ రోజు నిప్పులా మారారు.. నేను మాత్రం తక్కువ తిన్నానా? అనుకుంటున్నారు లోకేష్. కానీ ఇంకా సమయం పడుతుందంటున్నారు నెటిజన్లు.