జాతీయ రాజకీయాలపై కేసిఆర్ గట్టిగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మద్య భారత రాష్ట్ర సమితి పేరుతో కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఏమైందో తెలియదు గాని ఆ పార్టీ ప్రస్తావన ప్రస్తుతం ఎక్కడ వినిపించడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కేసిఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు కేసిఆర్. ఈ నేపథ్యంలో బిహార్ పర్యటన చేపట్టారు.
అయితే బిహార్ లో కేసిఆర్ కు ఊహించని పరాభవం ఎదురైంది. పాట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ” ప్రధాన మంత్రి అభ్యర్థిగా నితిశ్ కుమార్ ను ఎన్నుకునే అవకాశం ఉందా ? ” అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కేసిఆర్ ” ప్రదాన మంత్రి అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనేదానిపై అని పార్టీల వారు చర్చించి తరువాత ప్రకటిస్తాం ” అని బదులిచ్చారు. దాంతో అక్కడే ఉన్న నితిశ్ కుమార్ మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేందుకు ప్రయత్నించారు. అలా రెండు మూడు సార్లు నితీశ్ కుమార్ మీడియా సమావేశం జరుగుతున్నప్పటికి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.
దీంతో బీజేపీ శ్రేణులు.. కేసిఆర్ కు జరిగిన అవమానాన్ని ఎద్దేవా చేస్తున్నారు. అయితే బీజేపీ వ్యతిరేక శక్తిగా ఏర్పడేందుకు కేసిఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం మొదట్లోనే ఎదురుదెబ్బలు తగులుతుండడంతో బీజేపీ నేతలకు ఊతం ఇచ్చినట్లయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పరచడంలో కేసిఆర్ సక్సస్ అయినప్పటికి ప్రధాని అభ్యర్థి రేస్ లో మాత్రం అసమ్మతి సెగలు రేగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
Also Read