వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఢిల్లీలో సోనియాతో భేటీ తర్వాత ఆమె ఈ నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే భారీ బహిరంగసభ ద్వారా వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేయనున్నారు. అయితే వాస్తవానికి షర్మిల రాక కాంగ్రెస్కు లాభమే చేకూర్చినా కొంతమంది నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొలుత షర్మిల రాష్ట్ర నేతల ద్వారా కాంగ్రెస్లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ అవి ఫలించలేదు. దీంతో ఏకంగా అగ్రనేతల ఆశీస్సులతో హస్తం గూటికి చేరనున్నారు.
అయితే షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సీట్ల పంపిణీలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. షర్మిల వైఎస్ఆర్టీపీలో ఉండగానే తాను పాలేరు నుండి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. అంతేగాదు పార్టీ కార్యాలయాన్ని సైతం నిర్మించి పాదయాత్ర సైతం చేశారు. ఇక ఇక్కడి నుండే తాను సైతం బరిలో ఉండనున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఈ సీటు కోసమే ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా షర్మిల ఎంట్రీతో పాలేరు రాజకీయాలు తుమ్మల వర్సెస్ షర్మిలగా మారిపోయాయి. వీరిద్దరూ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందో చూడాలి. అయితే పాలేరు నుండి షర్మిలను, ఖమ్మం నుండి తుమ్మలను బరిలో దించి ఈ సమస్యకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్న ఈ ప్రతిపాదనకు తుమ్మల ఒప్పుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.