సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షపార్టీ వైసీపీకీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక వైపు జగన్ తన పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకొస్తుంటే..మరో వైపు పార్టీలో కుమ్ములాటలు, అసమ్మతి, అసంతృప్తి బయటపడుతున్నాయి. పార్టీనుంచి సీనియర్ నాయకులు ఒక్కొక్కరూ పార్టీనీ వీడుతుండటంతో నేతల్లో అంతర్మథనం మొదలయ్యింది.
మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి దూరమైన తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో కూడ పరిస్థితులు నచ్చని కారణంగా దుర్గేష్ రాజీనామా చేశాడు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని దుర్గేష్ అభిప్రాయపడుతున్నాడు.
కొండెపి నియోజకవర్గంలో సమన్వయకర్తగా పనిచేస్తున్న వరికూటి అశోక్ బాబు స్ధానంలో డాక్టర్ వెంకయ్యను జగన్ నియమించటమే గందరగోళానికి కారణమైంది. చాలా కాలంగా వరికూటి పార్టీ కార్యక్రమాలతో నియోజకవర్గంలో బాగా చొచ్చుకుపోతున్నారు. అశోక్ అంటే ఏమాత్రం పడని కొందరు నేతలు మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి ద్వారా జగన్ పై ఒత్తిడి తెచ్చారు. దాని ఫలితంగా అశోక్ స్ధానంలో స్ధానిక డాక్టర్ వెంకయ్యను సమన్వయకర్తగా జగన్ నియమించారు.
వరికూటికి అనుకూలంగా నియోజకవర్గంలోని గ్రామస్ధాయి నుండి సమీకరణలు మొదలయ్యాయి. దాంతో రాష్ట్ర నాయకత్వం కూడా వరికూటిపై మండిపడుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా అయినా సరే పోటీ చేయాల్సిందేనంటూ మద్దతుదారులు వరికూటికి గట్టిగా చెబుతున్నారు.
పార్టీలో సీనియర్ నేత, కాకినాడ పార్లమెంటుకు పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ పార్టీకి రాజీనామా చేయటం ఖాయమని సమాచారం. అయితే పార్టీలోని స్ధానిక నాయకత్వంతో తలెత్తిన విభదాల కారణంగానే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఎంపిగా టిక్కెట్టు విషయంలో కూడా జగన్ నుండి హామీ రాలేదట. సునీల్ పరిస్ధితిని గమనించిన తెలుగుదేశంపార్టీ, జనసేనపార్టీల నేతలు సునీల్ ను పార్టీల్లోకి చేర్చుకోవటానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ కూడా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీనీ వీడేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్ నియమించారు. దీంతో మర్రిరాజశేఖర్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా పలు గ్రామాలు, పట్టణాల్లోని వివిధ వార్డులకు చెందిన నాయకులు, కౌన్సిలర్లు మర్రి రాజశేఖర్ నివాసం వద్దకు చేరుకుని భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తున్నారు. పార్టీ నేతల్లో ఉన్న అసమ్మత నేతలపై జగన్ దృష్టి సారించకపోతే ఎన్నికల వేల పార్టీకీ భారీ నష్టం జరగనుంది.