ఏపీలో భాజాపా ,టీడీపీ మధ్య మాటల యుద్ధం గత కొంత కాలంగా కానసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏనుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య మరింత ఆజ్యం పోశారు. చంద్రబాబు చేసిన ఒక రోజు దీక్షలో బాలయ్య మోదీపై అసభ్యవ్యాఖ్యలు చేయడంతో భాజాపా రగిలిపోతోంది.
బాలయ్య చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విరుచుకు పడ్డారు. ఈ ఏడాదిలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని వ్యాఖ్యానించారు. విజయవాడలో చంద్రబాబు నిన్న చేసిన ధర్మపోరాట దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతున్నపుడు చంద్రబాబు నవ్వుతున్నారని ఆయన గుర్తుచేశారు. బాబు ప్రభుత్వం గాడి తప్పినట్టుందన్నారు. బాలకృష్ణ ఉపయోగించిన భాషను ఎవరు వాడుతారని ప్రశ్నించారు. 2019లో ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఇపుడే కనపడుతోందని.. అందుకే ఆయన లయ తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సాక్షిగా పెట్టమని కోరుతున్నామన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్కు టీడీపీకి అలవాటైపోయిందన్నారు. అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.