సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఒక వైపు ప్రతపక్షపార్టీలను అధికార పార్టీ టార్గెట్ చేస్తుంటే….మరో వైపు అధికారపక్షాన్ని వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇటీవల ఏపీ మంత్రి సోమిరెడ్డి బావ రామకోటా రెడ్డి వైసీపీలో చేరగా, వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి బావమరిది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కోట్ట కుటుంబం కూడా టీడీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్దం అయ్యిందనే చెప్పాలి. తాజాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం కూడా వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. దీనికి బలాన్ని చేకూర్చేవిధంగా ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వర్ల రత్నం సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. గతంలో కృష్ణాజిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు రత్నం.
వర్ల రత్నం టీడీపీని ఎందుకు వీడాలనుకుంటున్నారు? ఆయనకు వైసీపీ నేతల నుంచి ఎలాంటి హామీ లభించింది? అన్న విషయాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ వార్తలపై వర్ల రామయ్య కూడా స్పందించలేదు. వర్ల రత్నం పార్టీ మారడానికి కారణాలు ఏమిటనే చర్చ సాగుతోంది.