తెలంగాణాలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇమేజ్ ఉన్న నాయకులందరూ ఇతర పార్టీల్లోకి వెల్లడంతో పార్టీ దీనావస్థ స్థితిలో ఉంది. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇక టీడీపీలోనే ఉంటే భవిష్యత్తు ఉండదనే భావనతో ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు.
తాజాగా ఆ పార్టీకీ మరో బిగ్షాక్ తగలనుంది. మరో సీనియర్ నేత కారెక్కెందుకు రంగం సిద్ధం చేసకుంటున్నారు. తెలంగాణాలో టీడీపీకీ పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో కారు ఎక్కేందుకు సన్నాహకాలన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది.
2019 ఎన్నికల్లో ఆలేరు నియోజకర్గం నుంచి టీఆర్ఎస్ తరపున మోత్కుపల్లి పోటీ చేయనున్నారని చెబుతున్నారు. అయితే తుంగతుర్తి అసెంబ్లీ లేదా వరంగల్ లోక్ సభ నుంచి ఏదో ఒక చోట పోటీ చేయాలని టీఆర్ఎస్ కోరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మోత్కుపల్లిని పలుమార్లు కలిసి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలహీన పడిందని, పార్టీని టీఆర్ఎస్ లో కలపడమే మంచిదని గతంలో మోత్కుపల్లి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.