తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, గత ఎన్నికల్లో పరాజయానికి బదులు తీర్చుకోవాలని టీడీపీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈక్రమంలోనే తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని టీడీపీ ప్రకటించింది. వైసీపీ తరపున ఫిజియోథెరపిస్టు గురుమూర్తి టికెట్ పొందే అవకాశాలున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2.28 లక్షల మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఆయన హఠాన్మరణంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
అయితే, గత ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి 20 వేల ఓట్లు పోలయ్యాయి. అంటే ఇరు పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నమాట. ఇక ఇంతటి పేవల ప్రదర్శన చేసిన బీజేపీ, జనసేన తాజా ఉప ఎన్నికలో కలిసి పనిచేయకుండా.. మేమేంటే మేమే పోటీ చేస్తాం. మాకే గెలుపు అవకాశాలు ఎక్కువ అంటూ భిన్న ప్రకటనలు ఇస్తున్నాయి. గత ఎన్నికలో డిపాజిట్లు కూడా రాని ఇరు పార్టీలు ఉమ్మడిగా పోడీచేయడం మానేసీ సిగపట్లు పడుతుండటం అభిమానులు, కార్యకర్తల్ని కలవరానికి గురిచేస్తోంది.
ఇంకా క్లారిటీ లేదు
త్వరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? విడివిడిగా పోటీ చేస్తాయా? అనే విషయమై ఇప్పటివరకు ఒక స్పష్టతకు రాలేదు. ఈక్రమంలోనే రెండు పార్టీల అధినేతలు సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ హైదరాబాద్లో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే, ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్దితులు, నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతుల గురించి, రాష్ట్రంలో రోడ్ల దుస్ధితితో పాటు ఏలూరులో వింతరోగం తదితర అనేక అంశాలపై చర్చించిన పవన్, వీర్రాజు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల గురించి మాత్రం చర్చించలేదని తెలిసింది.
తిరుపతిలో ఉప ఎన్నికలో జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పగా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్ధిని ఫైనల్ చేసే విషయంపై మరోసారి భేటీ అవుదామని వీర్రాజు విషయాన్ని దాటవేసినట్టు సమాచారం. ఇక రెండింటిలో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేసినా రెండోవాళ్లు విజయం కోసం పనిచేయాలని ఒక స్ధూలమైన నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, అభ్యర్థి ప్రకటనలో జాప్యం బీజేపీ వ్యూహంలో భాగమనే తెలుస్తోంది. జనసేనతో దోస్తీ చెడకుండా ఎన్నికలు దగ్గరపడేవరకు వేచి చూసి, పార్టీ ముఖ్య నేతలతో పవన్ను బుజ్జగించి జనసేనను పోటీ నుంచి తప్పించడమే కాషాయపార్టీ ఎత్తుగడ అని తెలుస్తోంది. మరి కమలం ట్రాప్లోనుంచి పవన్ బయటపడతాడా? లేదా చూడాలి!