ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్న వేల టీఆర్ఎస్ పార్టీకీ మరో బిగ్షాక్ తగలనుంది.నేతలు మెరుగైన ‘భవిష్యత్తు’ను వెతుక్కుంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీలు మారగా.. రానున్న రోజుల్లో మరింత మంది నాయకుల మెడలో కండువాల రంగు మారనుంది.
దివంగత నేత కాకా తనయుడు వినోద్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవల ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై, తన చేరికపై చర్చించినట్టు సమాచారం.వీలైతే దసరాలోపు లేదంటే 20వ తేదీన భైంసాలో జరిగే రాహుల్ గాంధీ సభలో ఆయన మూడు రంగుల కండువాను కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
ఆయన సోదరుడైన మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ కూడా కాంగ్రెస్లోకి చేరే విషయంలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. వీరిద్దరూ 2013లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంతో.. 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తిరిగి సొంత గూటికి చేరారు.
చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన వినోద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వివేక్ ఓడిపోయారు. దీంతో రెండేళ్లలోపే తిరిగి టీఆర్ఎస్లో చేరారు. వివేక్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.వచ్చే ఎన్నికల్లో వినోద్ చెన్నూరు టికెట్ ఆశించారు. కానీ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్కు కేసీఆర్ ఆ స్థానాన్ని కేటాయించారు. దీంతో ఆయన పార్టీపై గుర్రుగా ఉన్నారు.ఇద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఏ నిర్ణయమైనా కలిసే తీసుకునే వివేక్, వినోద్ లు ఈ దఫా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొని ఉంది. వినోద్ సైతం తన సోదరుడు వివేక్ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.