తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ను వీడి మాజీ ఎంపీ పొంగులేటి తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ నుండి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేశారు. ఇందుకు తగ్గట్టుగా కార్యచరణ సిద్ధం చేసి తన అనుచరులను ప్రజాక్షేత్రంలో ఉండేలా పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి,ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా తుమ్మలతో భేటీ అయిన అనంతరం మాట్లాడిన పొంగులేటి ఇద్దరం కలిసి సీఎం కేసీఆర్ను ఓడించి తీరుతామని చెప్పారు. వాస్తవానికి వీరిద్దరు జిల్లాలో బలమైన నేతలు. జిల్లా వ్యాప్తంగా గెలుపు ఓటములు ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్నవారే. దీంతో రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు భంగపాటు తప్పేలా కనిపించడం లేదు.
ఇక వీరిద్దరికి తోడు తాజాగా షర్మిల కూడా చేరింది. తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు దాదాపుగా సిద్ధమైంది. సోనియాతో భేటీ అనంతరం విలీనంపై నిర్ణయానికి వచ్చారు షర్మిల. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరనుండటంతో పాటు భారీ బహిరంగసభను నిర్వహించేలా హస్తం నేతలు రెడీ అవుతున్నారు. మొత్తం వీరి ముగ్గురి టార్గెట్ కేసీఆరే కావడం అంతేగాదు ఈ ముగ్గురు కూడా ఖమ్మం జిల్లా నుండి పోటీ చేయనుండటం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశం. అన్ని అనుకున్నట్లు జరిగితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపథం నెరవేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.