పవన్ కల్యాణ్ తెలంగాణలో చేపట్టిన రాజకీయ యాత్రపై కాంగ్రెస్నుంచి విమర్శల దాడి పెరుగుతోంది. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించచారు. తాజాగా రాములమ్మ విజయశాంతి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చి రేపటితో 20 ఏళ్లు పూర్తవుతుందని చెప్పారు. ఏదైనా ఓ ప్రాంతం నుంచి తనను పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారని ఆమె తెలిపారు.
పవన్ కల్యాణ్ యాత్రపై స్పందించిన రాములమ్మ .. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో చిరంజీవికే దిక్కులేదనీ ఇక పవన్కు రాష్ట్రంలో ఏముంటుందని ప్రశ్నించారు . గతంలో సీఎం కేసీఆర్, పవన్ ఒకరినొకరు ఏమనుకున్నారో ప్రజలందరికీ బాగా తెలుసునని అన్నారు. పవన్.. తెలంగాణను వదిలేసి ఏపీలో దృష్టిపెడితే బాగుంటుందన్న విజయశాంతి సలహా ఇచ్చారు.
ఏపీకి విభజన బిల్లులో ఇచ్చిన హామీలు, ప్రత్యేకహోదాపై పోరాడాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలు పవన్ను ఆమోదించరని ఆమె తేల్చిచెప్పారు. రెండు చోట్ల ఆమోదం పొందడం చంద్రబాబు వల్లే కాలేదన్న విషయాన్ని జనసేన అధినేత గుర్తుంచుకోవాలని విజయశాంతి గుర్తు చేశారు.