ఆంధ్రప్రదేశ్లో వచ్చే సాధారణ ఎన్నికలకు ప్రచారం అప్పుడే ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయముంది. ఎన్నికల సమయంలో పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభిస్తాయి కాని…ఇప్పుడు మాత్రం డాదిన్నర ముందే ప్రచారం ప్రారంభించడం రాజకీయాల్లో కొత్త ట్రెండ్గా మారింది. వైసీపీ వైఎస్సార్ కుటుంబం , టీడీపీ ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో రంగంలోకి దిగారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా నాయకులంతా రోడ్డు మీద పడి ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగారంటే ఎన్నికల ప్రచారం కాక మరేమిటి? రెండు పార్టీల కార్యక్రమాలు ఒకేరోజు ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీల లక్ష్యం ప్రజలను అకట్టుకోవడం.
చంద్రబాబునాయుడు ఘనతను కీర్తించడం, ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టడం, సంక్షేమ, అభివృద్ధి పథకాలను వల్లె వేయడం. వైకాపాకు ఓట్లు వేయొద్దని, అది అభివృద్ధిని అడ్డుకునే పార్టీ అని జనం బుర్రల్లోకి ఎక్కించడం కూడా ప్రచారంలో భాగం. ఇది తప్ప వేరేది ఉండదు. ఇక వైకాపా కూడా చేసే పనేమిటి? చంద్రబాబు సర్కారు చేస్తున్న అవినీతిని, అక్రమాలను వివరించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టడం, మోసాలు చేస్తున్నారని చెప్పడం, జగన్కు అధికారం కట్టబెడితే మంచి పరిపాలన ఇస్తాడని వారి మైండ్సెట్ మార్చే ప్రయత్నం చేయడం.
జగన్ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తాడని ప్రజలను నమ్మించాలంటే వైకాపాకు ఉన్న మార్గం వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనను గుర్తు చేయడం. ఆయన అమలు చేసిన పథకాలను జ్ఞాపకం చేయడం. ఆ పథకాల వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని, అలాంటి మంచి మళ్లీ జరగాలంటే జగన్ అధికారంలోకి రావాలని చెప్పడం. వైఎస్సార్ పథకాలు, విజయాలే ప్రధాన అజెండాగా వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం సాగుతోంది.
ప్రధానంగా జనాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం వైసీపీ కి ఉంది. సంక్షేమ పథకాల పట్ల అవగాహన లేకపోవడంతో వాటిని సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. పథకాలపై అవగాహన కల్పించడానికే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించారట.
వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. గత వారం రోజుల్లో నాలుగు లక్షల మంది వైకాపా సభ్యుత్వం తీసుకున్నారని ఆ పార్టీ నాయకులు తెగ సంబరపడిపోతున్నారు. ఎన్ని లక్షలమంది సభ్యులయ్యారన్నది ముఖ్యం కాదు. ఓట్లు పడటమే ప్రధానం. వైకాపా దీన్ని సాధించగలదా? మూడున్నరేళ్లు చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన ఫలితం మొన్నటి రెండు ఎన్నికల్లో కనబడింది.
నంద్యాల, కాకినాడలో జగన్ ప్రచారానికి తండోపతండాలుగా జనం వచ్చారు. ప్రజలు జగన్ వెంటే ఉన్నారనే ఫీలింగ్ కలిగింది. రెండో చోట్ల గెలుపు తమదేనని భావించిన వైసీపీకి ప్రజలు చుక్కలు చూపించారు. ఫలితం మాత్రం తిరగబడింది. ప్రజలనాడిని పట్టడం ఎవరి వల్ల కాదని తేలిపోయింది. దీన్ని బట్టి జగన్ ఇంకెంత కష్టపడాలో ఆలోచించాలి.