విశాఖపట్టణం జిల్లా చోడవరంలో పాదయాత్ర చేస్తున్న జగన్ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబుపపై నిప్పులు చెరిగారు. భాజాపాతో నాలుగు సంవత్సరాలు సంసారం చేశారని…అప్పుడు ప్రత్యేకహోదా గుర్తుకు రాలేదాని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకు ధర్మపోరాట దీక్షల పేరుతో దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత షుగర్ పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. ఒకప్పుడు లాభాల్లో ఉన్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు 45 కోట్ల రూపాయలు అప్పుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. వైఎస్ సీఎం కాగానే 45 కోట్ల లాభంలోకి తెచ్చారన్నారు. మళ్లీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక చోడవరం షుగర్ ఫ్యాక్టరీ వంద కోట్లు నష్టాల్లోకి నెట్టేశారని జగన్ ఆరోపించారు.
లాభాల్లోకి తీసుకు రావాల్సిన ముఖ్యమంత్రి తన బినామీలతో షుగర్ ఫ్యాక్టరీని దోచేస్తున్నారని దుయ్యబుట్టారు. తడిసిన పంచదార పేరుతో ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు బినాబీ ఎంపీ సుజనా చౌదరి బంధువుకు అతితక్కువ ధరకే షుగర్ కట్టబెట్టారని మండిపడ్డారు.
అలాగే టన్న మెులాసిస్ ధర మార్కెట్లో 6వేలు ఉంటే దాన్ని కేవలం 2,700 రూపాయలకే కట్టబెట్టడంతో 20 కోట్లు షుగర్ ఫ్యాక్టరీకి నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ బాగుపడాలన్నా….రైతులు బాగుపడాలన్నా చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని కోరారు.
చంద్రబాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, కేజీ ఉల్లిని రూ.4 కొని, హెరిటేజ్ లో మాత్రం రూ.25కు అమ్ముతున్నారని ఆరోపించారు. ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబునాయుడు దళారీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాబు బినామీ కాలేజీల్లో ఇంటర్ చదవాలంటే ఏడాదికి రూ.లక్షా అరవై వేలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు దగ్గరుండి మరి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇరవై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని అన్నారు.