ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్ …చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అంటూ ధ్వజమెత్తారు. శ్రీకాకులం తుఫాను బాధితును పరామర్శించలేదని బాబు చేసిన వ్యాఖ్యలకు జగన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
బాబు తుఫాన్ను జయించానని గొప్పలు చెప్పుకుంటున్నారని సెటైర్ పేల్చారు. తుఫాను బాధితులను పరామర్శింలేదంటూ తనపై బాబు చేసిన వ్యాఖ్యలకు నవ్వాలో..ఏడ్వాలో తెలియడం లదేన్నారు.ముఖ్యమంత్రి మీరా? లేక నేనా? అని ప్రశ్నించారు. అధికారం యంత్రాంగం మీ చేతుల్లో ఉందా? లేక నా చేతుల్లో ఉందా? అని అడిగారు.
తాను పాదయాత్రలో ఉన్నందువల్ల తమ పార్టీ సీనియర్ నేతలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయక చర్యలను చేపట్టారని అన్నారు. వారం రోజుల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్తానని, శ్రీకాకుళం జిల్లాలో 50 రోజులు ఉంటానని చెప్పారు.
తిత్లీ ప్రభావంతో రూ.3435 కోట్ల నష్టం వచ్చిందని సీఎం చంద్రబాబే చెబుతున్నారని.. ఈ నష్టాన్ని ఆయన భర్తీ చేయాలన్నారు జగన్. టీడీపీ ప్రభుత్వం చేయని పక్షంలో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితుల్ని ఆదుకుంటామన్నారు.
తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సరైన ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు జగన్. కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయకలేకపోయారన్నారు. తాగునీటి కోసం బాధితులు చంద్రబాబును నిలదీశారని.. వారిని కూడా బెదిరించారని ఆరోపించారు. ప్రకృతిని హ్యాండిల్ చేశానని గొప్పలు చెప్పుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.