వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గమైన నగరిలో కొండచుట్టు మండపం వద్ద ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఈ నెల 30న గృహప్రవేశం కూడా చేయబోతున్నారు. ఇక నేను లోకల్, ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజాసేవ చేసుకుంటాను. అని రోజా చెప్పుకొస్తున్నారు. కానీ ఆమె మాటలను నమ్మేదెలా అని నగరి నియోజకవర్గ ప్రజలతో పాటు వైఎస్ఆర్ సీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. రోజా ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో వారానికి ఒకసారైనా నియోజకవర్గంలో తిరిగేవారు. తర్వాత అది రెండు వారాలకు ఒకసారి పర్యటనగా మారింది. క్రమంగా హైదరాబాద్ లో బతుకు జట్కాబండి, జబర్దస్త్, రచ్చబండ అంటూ టీవీ కార్యక్రమాలు, సినిమా షూటింగులు చేసుకుంటూ రాను రాను నియోజకవర్గం వైపు చూడటం మానేశారని స్థానికులు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడి మీద 2014లో 700 ఓట్ల మెజార్టీతో అతి కష్టమ్మీద రోజా గెలచింది. కానీ ఆ గెలుపు ఆమెలో గర్వాన్ని నింపిందని నగరి నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత సీనియర్ నాయకుడి మీదే గెలిచాను. అంటే ఇక తనకు నియోజకవర్గంలో తిరుగే లేదు…అనే భ్రమలో పూర్తిగా ఇటు రావడం మానేసిందని నగరి ఓటర్లు మండిపడుతున్నారు.
గాలి మరణంతో ఇక తనకు టీడీపీలో సరైన ప్రత్యర్ధి లేరనే భ్రమల్లో రోజా విహరిస్తున్నారని. ఈసారి ఎన్నికల్లో ఆమెకు గుణపాఠం తప్పదని అటు టీడీపీ నేతలతో పాటు ఇటు వైఎస్ఆర్ సీపీలోని కొందరు నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ సమయం హైదరాబాద్ లో, టీవీ షోల్లో గడిపే రోజా కనీసం నియోజకవర్గ సమస్యలపై ఫోన్ లో కూడా అందుబాటులో ఉండటం లేదని, ఆమె అసలు ఇక్కడి లోకల్ కేండిడేట్ కాదని మండిపడుతున్నారు. ఈ సారి ఆమెకు టికెట్ ఇచ్చినా గెలుపు కష్టమేననే 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయినట్లే ఈ సారి రోజాకు ఓటమి తప్పదని అంటున్నారు. ప్రధానంగా రోజా స్థానికురాలు కాదు. అనే విమర్శలు బలపడుతున్న నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికలు మరో ఆరు నెలలే ఉండటంతో ఈ సారి ఎలాగైనా నగరిలో ప్రజల మనసులు గెలుచుకోవాలని రోజా అక్కడే సొంత ఇంటి నిర్మాణం చేపట్టారు. కానీ ఆమె ఇల్లు కట్టుకున్నంత మాత్రాన జనం మనసులు గెలుచుకోలేరనే వాదన వినిపిస్తోంది.
ఈ నాలుగేళ్లూ, ఫోన్ లో కూడా అందుబాటులో లేని రోజా, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన అందుబాటులో ఉంటారనే నమ్మకం తమకు లేదంటున్నారు. ఆమెకు హైదరాబాద్ లో సొంతిల్లు ఉన్నందున, అక్కడే మకాం వేస్తారని చెబుతున్నారు.
మరో వైపు గాలి ముద్దు కృష్ణమనాయుడి మరణంతో ఆయన కుటుంబంపై సానుభూతి పవనాలు గట్టిగా వీస్తున్నాయి. పైగా సీనియర్ నాయకుడే అయినా గాలి ఎప్పుడూ పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. నిత్యం ప్రజల మధ్య కలియతిరిగేవారు. ఆయన కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. ఇప్పుడు ఆయన మరణంతో భార్య సరస్వతి లేదా కుమారుడికి టీడీపీ టికెట్ ఇవ్వనుంది. వాళ్లు సానుభూతి ఓట్లుతో పాటు గాలి చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతారు. ఆ రకంగా చూసినా రోజాకు గడ్డుకాలం తప్పదు. సో నాలుగేళ్లు హైదరాబాద్ లో జబర్దస్త్, రచ్చబండ, జట్కాబండి చేసుకుంటూ ఆరు నెలలు ఎన్నికలున్నాయనగా ఇల్లు కట్టుకున్నాను. ఓట్లేయండి. అంటే వేసేస్తారా ప్రజలు. ఏమో రోజా ఎత్తులు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాల్సిందే.