ప్రస్తుతం ప్రపంచ పర్యావరణాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతం ఏది అంటే.. ప్లాస్టిక్ అని. వెంటనే తడుముకోకుండా చెప్పేస్తాము. ఎందుకంటే పర్యావరణానికి ప్లాస్టిక్ ద్వారానే పెను ముప్పు పొంచి ఉంది. ప్లాస్టిక్ తయారీ కర్మాగారలలో వెలువడే ఉద్గారాల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంటే.. ప్లాస్టిక్ నిల్వల వల్ల భూ కాలుష్యం, జల కాలుష్యం వంటివి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఒక ప్లాస్టిక్ పదార్థం భూమిలో కుళ్లిపోవడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతోంది. దాంతో నిల్వ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని లక్షల టన్నుల్లో వివిధ మార్గాల ద్వారా సముద్రాల్లో చేరి కలుషితం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకంలో చైనా అగ్రస్థానంలో ఉంది. కేవలం ప్లాస్టిక్ వాడకంలోనే కాకుండా ప్లాస్టిక్ కాలుష్యంలో కూడా చైనా ముందు వరుసలోనే ఉంది. .
దీంతో ప్రపంచానికి పెను సవాల్ గా ఉన్న ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించేందుకు ఆయా దేశాలు గట్టి చర్యలు చేపడుతున్నప్పటికి ఫలితాలు మాత్రం కంపించడంలేదు. ముఖ్యంగా సముద్రాల్లో చేరుకున్న ప్లాస్టిక్ తిని ఎన్నో సముద్ర జీవులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు సముద్రాల్లో ఉండే మైక్రో ప్లాస్టిక్ ను తినే రోబోటిక్ టెక్నాలజీ ని అభివృద్ది చేశారు. చైనాలోని సిచువన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చేపల ఆకారంలో ఈ రోబోలను అభివృద్ది చేశారు. 1.3 సెంటీమీటర్లు ఉండే ఈ రోబోఫిష్ లు సముద్రాల్లో ఉందో మైక్రో ప్లాస్టిక్ ను తినడమే కాకుండా సముద్ర జలాల కాలుష్య స్థితిగతులను కూడా విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని అందిస్తాయని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ రోబో ఫిష్ ల వల్ల సముద్రాల్లో ఉండే ప్లాస్టిక్ చాలా వరకు తగ్గే అవకాశం ఉందట. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ రోబోలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సైటిస్టులు చెబుతున్నారు. నిజంగా ఈ రోబో టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కొంత మేర ప్లాస్టిక్ కాలుష్యం తగ్గే అవకాశం ఉంది.
More like this
కృత్రిమ మానవులు వచ్చేస్తున్నారోచ్ ..!