తెలుగు నటులకు ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డు నంది పురస్కారం. వివిధ విభాగాల్లో ఇచ్చే ఈ అవార్డును 1985 నుంచి హాస్యనటులకూ ఇవ్వడం ప్రారంభించారు. తమ నటనతో ప్రేక్షకులను అలరించి, నవ్వులు పూయించిన హాస్య నటులకు ఈ అవార్డు అందించారు. అందులో ఐదుగురు నటులు, వారికి నంది అందించిన పాత్రల గురించి..
బాబూ మోహన్ – మామగారు
దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో నటించిన ‘మామగారు’ సినిమాలో కోట శ్రీనివాసరావు-బాబూ మోహన్ కాంబినేషన్లో కామెడీ తెలియనివారు లేరు. ఆ సన్నివేశాలు చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. అందులో బాబూ మోహన్ వేసిన అడ్డుకునేవాడి పాత్ర అద్భుతంగా పండింది. ఆయనకు నంది అవార్డు అందించింది.
బ్రహ్మానందం – మనీ
‘ఖాన్తో గేమ్స్ వద్దు. శాల్తీలు లేచిపోతాయ్’.. ఈ డైలాగ్ వినగానే మనీ సినిమా, అందులో ఖాన్దాదా పాత్ర గుర్తొస్తుంది. బ్రహ్మానందం కెరీర్లో బాగా పాపులర్ అయిన పాత్రల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాకు గానూ ఆయన నంది పురస్కారం అందుకున్నారు.
ఏవీఎస్ – శుభలగ్నం
‘మీ ఇంట్లో బల్లుందా, గోడ మీద నల్లుందా’ అంటూ కనిపించిన అందర్నీ ప్రశ్నలు వేసే విచిత్రమైన పాత్రను ‘శుభలగ్నం’ సినిమాలో పోషించారు ఏవీఎస్. ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఇది. దాంతో పాటు నంది కూడా ఆయనింటికి నడిచి వచ్చింది.
ఎం.ఎస్.నారాయణ – మా నాన్నకు పెళ్లి
ఎం.ఎస్.నారాయణ అనగానే తాగుబోతు పాత్ర గుర్తొస్తుంది. దానికి మొదటి అడుగు వేయించింది ఈ చిత్రమే. ఇందులో ఆయన చేసిన తాగుబోతు పాత్ర విపరీతమైన పేరుతో పాటు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. తాగుబోతు పాత్రకు అవార్డా అని విమర్శించిన వారూ ఉన్నారు.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం – యజ్ఞం
ఫాతిమా మూగపిల్ల కాదన్న నిజం నిరూపించాలని చూసే తాగుబోతు పాత్రలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన కామెడీ సినిమాకు హైలెట్. ఈ పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చింది. నంది పురస్కారం కూడా అందించింది.
నచ్చిన పాత్రలను మిస్ చేసుకున్న నటీనటులు..!