దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న స్లెడ్జింగ్ జరగటం సాధారనం. కాని అస్ట్రేలియా, సఫారీల మధ్య చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రెండు దేశాల మధ్య డర్బన్లో జరిగిన మొదటి టెస్ట్లో ఆటగాళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే డేవిడ్ వార్నర్, డికాక్ మధ్య డ్రెస్సింగ్ రూముకి వెళ్లే సమయంలో జరిగిన గొడవ కారణంగా వివాదం చెలరేగగా.. డివిలియర్స్ని రనౌట్ చేసిన అనంతరం స్పిన్నర్ నాథన్ లియోన్ బంతిని ఏబీకి తగిలేలా విసిరినట్లు తేలడంతో ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది.
417 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 39/2తో నిలిచిన దశలో ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా రనౌటయ్యాడు. స్పిన్నర్ నాథన్ లియోన్ బౌలింగ్లో ఓపెనర్ మార్క్రమ్ బంతిని స్క్వైర్లెగ్ దిశగా నెట్టి పరుగు కోసం తొలుత నాన్స్ట్రైకర్ ఎండ్లోని ఏబీ డివిలియర్స్ని పిలిచాడు. దీనికి స్పందించి ఏబీ క్రీజు వదిలి సగం దూరం రాగా.. అప్పటికే వార్నర్ బంతిని సమీపిస్తుండటంతో.. మార్క్రమ్ కంగారు పడి ఏబీని వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించాడు.
కానీ.. ఏబీ వెనక్కి వెళ్లేలోపు.. మెరుపు వేగంతో స్పందించిన వార్నర్.. బంతిని బౌలర్ నాథన్కి ఇవ్వడంతో.. డివిలియర్స్ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. అయితే.. బంతితో బెయిల్స్ను పడగొట్టిన నాథన్.. అనంతరం బంతిని ఏబీ డివిలియర్స్ శరీరానికి తగిలేలా విసరడంపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నాథన్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు అతని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను జతచేసింది.