ఆశించిన మేర రాణించకపోవడంతో వన్డే సిరీస్ కోల్పోయిన కోహ్లిసేన టీ20 సిరీస్ సాధించడంతో ఊరట లభించింది. తాజాగా బీసీసీఐ టీమిండియాకు మరో ఊరటనిచ్చే విషయం చెప్పింది. వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన హిట్మ్యాన్ రోహిత్ శర్మ చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి రానున్నాడని వెల్లడించింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైద్య బృందం శుక్రవారం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో రోహిత్ పాసయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు. కాగా, ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ పాసవడంతో డిసెంబర్ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలున్నాయి.
ఇక నిబంధనల ప్రకారం రోహిత్ 14 రోజుల క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. ఇదిలాఉండగా… టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి భార్య అనుష్క బిడ్డకు జన్మనివ్వనుండటంతో తొలి టెస్టు అనంతరం అతను మెటర్నిటీ సెలవులపై స్వదేశానికి రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి టెస్టు అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17నుంచి జరగనుంది.