బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఏకంగా దేశ ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ జోక్యం చేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లను కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి తప్పించింది.
ఈ సంఘటనై విచారణ చేపట్టి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లపై జీవితకాల నిషేధం విధించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. క్రికెట్ లో బాల్ ను ట్యాంపరింగ్ చేయడం అతిపెద్ద నేరాల్లో ఒకటని, ఈ పని చేసిన వాళ్లను జట్టులో కొనసాగనిస్తే, అది దేశ పరువు, ప్రతిష్ఠలపై విమర్శలు తెస్తుందని వెల్లడించిన అధికారులు, వారిద్దరినీ జట్టు నుంచి, క్రికెట్ నుంచి పూర్తిగా నిషేధించాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.
వారు చేసిన నేరానికి కేవలం ఒక్క మ్యాచ్ నిషేధం విధించి వదిలేస్తే సరిపోదని, ఇది ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్తును నాశనం చేయకుండా చూడాలని వారు వెల్లడించినట్టు సమాచారం. కాగా, ఈ తరహా మోసం చేస్తున్నది మన క్రికెటర్లేనా? అని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్నబుల్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికన్నా అడుక్కోవడం నయమని, రోల్ మోడల్స్ గా ఉండాల్సిన ఆటగాళ్లు ఇలా మారిపోయారంటే నమ్మలేకున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు.