ప్రపంచ కప్లో టీమిండియా సెమీస్కు దూసుకెల్లింది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. తాజా ప్రపంచకప్లో ఇప్పటివరకు సెమీస్కు చేరిన తొలి ఆసియా జట్టుగా భారత్ ఘనతను అందుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్లో బంగ్లా అద్భుతంగా పోరాడింది. ఓ దశలో విజయం వైపు పయనించింది. అయితే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా ఓటమిపాలైంది.ఓ దశలో బంగ్లా చివరి వరుస బ్యాట్స్ మెన్ భారత్ ను భయపెట్టినా, వరల్డ్ నంబర్ వన్ బౌలర్ బుమ్రా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్నందించాడు.
టీమిండియా నిర్దేశించిన 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా పోరాడినప్పటికీ విజయం అందుకోలేక పోయింది. 48 ఓవర్లలో 286 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో బంగ్లా ఆటగాళ్లు షకీబుల్(66), సైఫుద్దీన్(51 నాటౌట్) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. షబ్బీర్(33), సౌమ్య సర్కార్(33), రహీమ్(24), లిట్టన్ దాస్(22)లు కీలక సమయాలలో వికెట్లు చేజార్చుకోవడంతో బంగ్లా ఓటమిపాలైంది. భారత బౌలర్లలో బుమ్రా(4/55), హార్దిక్ పాండ్యా(3/60)లు బంగ్లా పతనాన్ని శాసించారు.
మొదట టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ మరో మాట లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. రోహిత్శర్మ (104) రికార్డు సెంచరీకి తోడు రాహుల్ (77) రాణింపుతో పోరాడే స్కోరు అందుకున్న భారత్.. బంగ్లా పనిపట్టింది. బుమ్రా (4/55), హార్దిక్ (3/60) విజృంభణతో మరో మ్యాచ్ మిగిలుండగానే నాకౌట్ బెర్తు దక్కించుకున్నది. రిషభ్ పంత్ (48; 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), ధోని(35; 33 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త ఫర్వాలేదనిపిం చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్కు 5 వికెట్లు దక్కగా, షకిబుల్, రుబెల్, సౌమ్య సర్కార్ తలో వికెట్ పడగొట్టారు.