సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్తో మూడో టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి రిషబ్ పంత్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య గురువారం నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో పంత్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. 47వ ఓవర్లో స్టోక్స్ వేసిన బౌలింగ్లో రహానె ఎల్బీడబ్ల్యూగా ఔటవ్వడంతో రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్లో ఉన్న పుజారాతో కలిసి పంత్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. ఈ క్రమంలో 29 బంతులాడిన పంత్ ఒక్క పరుగు కూడా చేయలేదు. 57వ ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్లో పంత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
దీంతో పంత్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 29 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయని బ్యాట్స్మెన్లు జాబితాలో పంత్ చోటు దక్కించుకున్నాడు. సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్తో కలిసి సంయుక్తంగా ఈ జాబితాలో కొనసాగుతున్నాడు.
2014-15 సీజన్లో పాకిస్థాన్తో జరిగిన ఓ టెస్టులో ఇర్ఫాన్ పఠాన్, 2011లో ఇంగ్లాండ్తో జరిగిన ఓ టెస్టులో సురేశ్ రైనా ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్కు చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న టీమిండియాను పుజారా ఆదుకున్నారు. సెంచరీతో జట్టుని ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులకి ఆలౌటైంది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో కోహ్లీసేన 27 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.