దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు నిలకడగా ఆడుతోంది. మొదటి టెస్ట్లో విఫలమైన ఓపెనర్లు రెండో టెస్టులక్ష నిలకడగా ఆడుతున్నారు. లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా దక్షిణాఫ్రికా ఓపెనర్లు మర్క్రామ్(51 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(26 బ్యాటింగ్)లు నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. తద్వారా లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 27.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో.. మ్యాచ్ ఆరంభ ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ ఈ ఓపెనర్లని విడదీసిన విషయం తెలిసిందే.
సెంచూరియన్ పిచ్ ఎక్కువగా బౌన్స్కి అనుకూలిస్తుందనే ఉద్దేశంతో భువనేశ్వర్ని రెండో టెస్టు నుంచి తప్పించి.. ఇషాంత్ శర్మకి కెప్టెన్ కోహ్లి అవకాశమిచ్చాడు. ఈ పొడుగరి పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. సఫారీ బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించలేకున్నాడు. అతనితో పాటు బంతిని పంచుకుంటున్న మహ్మద్ షమీ ఇప్పటికే 4 ఓవర్లు వేసి 23 పరుగులు సమర్పించుకోవడం విశేషం. హార్దిక్ పాండ్య, బుమ్రా, ఇషాంత్ కనీసం 4 ఓవర్లు పైనే బౌలింగ్ చేసినా.. సఫారీ ఓపెనర్లని విడదీయలేకున్నారు. దీంతో వరుసగా బౌలర్లని కోహ్లి మారుస్తున్నాడు.
రెండో టెస్టు తుది జట్టులో టీమిండియా మూడు మార్పులు చేసి బరిలోకి దిగింది. గాయపడ్డ వికెట్ కీపర్ సాహా స్థానంలో పార్థీవ్ పటేల్కు అవకాశం కల్పించారు. ఇక శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి రాగా, భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకున్నారు. కాగా దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్ స్టెయిన్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్ట్లో టీమిండియా ఓటమిపాలు కావడంతో సఫారీలు 1-0 తో ఆధిక్యంలో ఉన్నారు.
తొలి టెస్టు విజయంతో రెట్టించిన ఉత్సాహంతో దక్షిణాఫ్రికా ఉండగా, ఎలాగైనా ఈ టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది. సెంచూరియన్లో ఇప్పటివరకూ 22 టెస్టులాడిన దక్షిణాఫ్రికా 17 విజయాలతో జోరుమీదుంది. మరి కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి.